Saturday, October 16, 2010

విజయదశమి అంటే సకల విజయాలనూ కలుగ చేసే దశమి...

విజయీభవ..!
నవరాత్రి పూజను తొమ్మిది రోజులపాటు చేయాలి. తొమ్మిది రోజులు చేయలేనివారు ఐదురోజులు, ఐదురోజులు చేయలేనివారు మూడు రోజులు, మూడు రోజులు కూడా చేయలేనివారు కనీసం ఒక్కరోజయినా పూజ చేసినట్లయితే సంవత్సరమంతా అమ్మవారిని ఆరాధించిన ఫలం లభిస్తుందని శాస్తవ్రచనం. నవరాత్ర వ్రతం ద్వారా తనను ఆరాధించిన వారిని దుర్గాదేవి అనుగ్రహిస్తుంది. నారద పాంచరాత్ర గ్రంథంలో నవ అనే శబ్దానికి పరమేశ్వరుడని, రాత్రి శబ్దానికి పరమేశ్వరి అనీ అర్థాలు ఉన్నాయి. ఈ ప్రకారం చూస్తే పార్వతీ పరమేశ్వరుల ఆరాధనమే నవరాత్ర వ్రతం.

విజయదశమి అంటే సకల విజయాలనూ కలుగ చేసే దశమి. ఆ రోజున ఆరంభించే ఏ పని, వృత్తి, వ్యాపారం అయినా అఖండ విజయం సాధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ పర్వదినాన్ని ముహూర్తంగా ఎంచుకుని మంచి పనులు ప్రారంభిద్దాం!


నవరాత్రి ఉత్సవాల్లో అందరినీ సమ్మోహితులను చేసే అంశం - అమ్మవారి అలంకారాలు. రాక్షస సంహార క్రమంలో దుర్గాదేవి ధరించిన రూపాలకు ప్రతిగా రోజుకు ఒక అలంకారం చొప్పున నవరాత్రులు జరిగే రోజుల్లో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరిస్తారు. అసుర సంహారంచేసి సాధించిన విజయానికి చిహ్నంగా పదో రోజున విజయదశమి పర్వదినాన్ని జరుపుకుంటారు. మధుకైటభాది రాక్షస సంహారం కోసం అమ్మ ధరించిన ఈ రూపాలనే ‘నవదుర్గా’ రూపాలుగా దేవీ, మార్కండేయ, భవిష్య పురాణాలు చెబుతున్నాయి. దేవీ భాగవతం ప్రకారం శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిద అనేవి నవదుర్గా రూపాలు. ప్రతి అవతారానికి ఓ ప్రత్యేక ఆధ్యాత్మిక, ఉపాసనా రహస్యాలు ఉన్నాయి.

మహాగౌరి : అనితర సాధ్యమైన తపస్సు ద్వారా నల్లని తన మేని ఛాయను మార్చుకుని ధవళ కాంతులతో ప్రకాశించిన దుర్గాదేవి స్వరూపం మహాగౌరి. ఈమె ఉపాసన సద్యఃఫలదాయకమై, భవిష్యత్తులో సైతం పాపచింతనలు దరిచేయనీయదు. అసంభవాలైన కార్యాలు సాధించడానికి ఈ తల్లి అనుగ్రహం ఎంతో అవసరం.

సిద్ధిదాత్రి: అష్ట సిద్ధులతోపాటు మోక్షసిద్ధిని కలిగించే అమ్మరూపం ‘సిద్ధిద’. లౌకిక, అలౌకిక సర్వార్థ సిద్ధులకు ఈమెను అధిష్టాన దేవతగా శాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి. సర్వకార్య సాధక స్వరూపం సిద్ధిద. పరమ శివుని అర్ధభాగంగా ఉన్న ఈమె చతుర్భుజాలతో భక్తుల పూజలందుకుంటుంది. ఈమె కమలాసన. మరొక కమలాన్ని చేతిలో ధరించి ఉంటుంది. ఈమెను నిష్ఠతో ఆరాధించిన వారికి సకల సిద్ధులు లభిస్తాయి. అంత్యకాలంలో పరమపదాన్ని చేరుకుంటారు.

కాశ్మీరం నుంచి కన్యాకుమారి దాకా ఆదిశక్తిని వివిధ రూపాలతో, నామాలతో అర్చిస్తారు. దుర్గ, లక్ష్మి, సరస్వతి రూపాలలో జీవితాన్ని సుఖశాంతిమయం చేసుకునే రాత్రులే నవరాత్రులు. నవరాత్రులలోని మొదటి మూడు రాత్రులు దుర్గగా, తర్వాతి మూడురాత్రులు లక్ష్మిగా, చివరి మూడు రాత్రులు సరస్వతిగా శక్తిస్వరూపిణి అయిన అమ్మ ఆరాధనలు అందుకుంటుంది.
పదవ రోజున నవరాత్రి పూజలకు స్వస్తిచెబుతూ విజయదశమి వేడుకలు జరుపుకుంటారు. కొన్ని ప్రాంతాలలో శరన్నవరాత్రోత్సవాలలో శ్రీరాముని ఆరాధన కూడా జరుగుతుంటుంది.

విజయానికి నాంది ఈ దశమి
నవరాత్రులలో అమ్మవారిని ఆరాధించి శక్తి పుంజుకున్న మానవుడు విజయం కోసం ఉవ్విళ్లూరడం సహజం. ఎందుకంటే దసరా పండుగ అందరికీ విజయాలను చేకూర్చే పండుగ. ఎందరో రాజులు విజయ దశమిని విజయప్రాప్తి దినంగా ఎన్నుకున్నట్లు చరిత్ర చెబుతోంది శ్రీరాముని పాలనాకాలం నుంచే విజయదశమిని విజయ ప్రస్థానంగా పరిగణించారు. శ్రీ రాముడు ఈ రోజే రావణుడిపై దండెత్తి వెళ్లాడు. ఛత్రపతి శివాజీ మొగలాయి రాజు ఔరంగజేబును ఎదుర్కొనడానికి విజయదశమినే ముహూర్తంగా ఎంచుకుని, అదేరోజున యుద్ధం చేసి, అఖండ విజయం సాధించాడు.

ఆశ్వయుజమాసంలో విజయవాడలోనూ తిరుమలలోనూ జరిగే బ్రహ్మోత్సవాల సందడి యావద్భారతదేశానికీ కన్నుల పండువ చేస్తుంది. ఈ మహోత్సవాల సంబరాన్ని తిలకించాలంటే విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ ఆలయాన్ని సందర్శించి తీరవలసిందే. ఈ పదిరోజులూ చేసే పూజలూ అలాంకారాలతో అమ్మ నూతన తేజస్సును సంతరించుకుని మరింత శోభాయమానంగా దర్శనమిస్తుంది.

కారణజన్మురాలయిన దుర్గమ్మ త్రిమూర్తుల తేజస్సుతో, త్రిమూర్తుల తే జస్సుతో, ముక్కోటి దేవతల శక్తులనూ పుణికిపుచ్చుకుని మహిషారుడనే లోకకంటకుడయిన రాక్షసుని సంహరించి విజయాన్ని చేజిక్కించుకుంది.

కౌమారీ పూజ
నవరాత్రులలో ఒక్కొక్కరోజు ఒక్కొక్క దేవతను పూజించే విధానం దేవీభాగవతంలో ఉంది. దీని ప్రకారం కన్నెపిల్లలను లేదా రజస్వల కాని బాలికలను మంత్రోక్త విధానంలో దేవతావాహనం చేసి పూజిస్తారు.
తొలిరోజు అంటే ఆశ్వయుజ శుద్ధ పాడ్యమినాడు రెండేళ్ల వయసున్న బాలికను పూజిస్తారు. అది మొదలు నవరాత్రులు ముగిసేవరకు బాలికలను ఇంటికి తీసుకొచ్చి వారిలో నవదుర్గలను ఆవాహన చేసి షోడశోపచారాలతో సర్వాలంకార శోభాయమానంగా పూజిస్తారు.

శమీవృక్షానికీ, విజయ దశమికీ అవినాభావ సంబంధం ఉంది. శమీవృక్షం కనక ధారలు కురిపిస్తుందనే విశ్వాసం ఉంది. శమీవృక్ష నీడ, శమీవృక్షపు గాలులు అన్నీ విజయ సోపానాలకు దారితీస్తాయనే నమ్మకం అనాదిగా ఉంది. శ్రీరాముడు వనవాసం చేసేటప్పుడు శమీవృక్షం కలపతోనే కుటీరం నిర్మించుకున్నాడని చెబుతారు. శమీవృక్షం విశిష్ఠతను పాండవులకు శ్రీకృష్ణుడే స్వయంగా చెప్పి, వారి ఆయుధాలను ఆ వృక్షం మీద దాయడం వల్ల కలిగే శుభఫలితాలను వివరించడం వల్ల పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్లేముందు తమ దివ్యాస్ర్తాలను జమ్మిచెట్టుపైనే దాచారు.

మహిషాసురమర్దిని: సర్వదేవతల తేజస్సుల కలయిక అయిన ఆదిశక్తి మహిషాసుర మర్దిని. ఆశ్వయుజ శుద్ధ నవమిరోజున మహిషాసురుడిని సంహరించింది కనుక మహర్నవమినాడు అమ్మకు ఆ అలంకరణ చేస్తారు. సింహవాహన అయిన మహిషాసురమర్దిని నేటి పర్వదినాన ఉగ్రరూపంలోగాక శాంతమూర్తిగా దర్శనమివ్వడం విశేషం. మహిషాసురమర్దిని అలంకార ంలో అమ్మను దర్శించుకోవడం వల్ల భక్తులకు సకల శుభాలూ చేకూరడమేగాక పిశాచబాధలు తొలగుతాయని భక్తుల విశ్వాసం.

శ్రీరాజరాజేశ్వరి: లోకశుభంకరి, అపరాజితాదేవి అయిన శ్రీ రాజరాజేశ్వరీదేవి దసరా ఉత్సవాల ముగింపు రోజయిన విజయదశమినాడు భక్తులకు చెరకుగడతో, అభయముద్రతో, ఆర్తితో పిలవగానే వచ్చే పాపగా దర్శనమిస్తుంది. రాజరాజేశ్వరీ అవతారాన్ని దర్శించడం వల్ల సర్వకార్యానుకూలత, దిగ్విజయ ప్రాప్తి కలుగుతాయి.

దుష్టరాక్షసులయిన రావణ కుంభకర్ణమేఘనాథులను సంహరించినందుకు గుర్తుకు కొన్ని ప్రాంతాలలో వారి దిష్టిబొమ్మలను తయారు చేసి టపాసులతో పేల్చేయడమో లేదా దహనం చేయడమో ఒక ఉత్సవంగా నిర్వహిస్తారు. తెలంగాణ ప్రాంతంలో దసరాకు చేసే బతుకమ్మ పండుగ ప్రఖ్యాతమైంది. విజయనగరంలో పైడితల్లి వేడుకలు జరుపుతారు. ఆంధ్రప్రాంతంలోని పల్లెలలో ‘శమీశమయితే పాపం శమీ శత్రువినాశనం, అర్జునస్య ధనుర్ధారీ, రామస్య ప్రియదర్శనం’ అంటూ శమీపూజ చేయడం, రైతులు, వివిధ వృత్తులవారు, కళాకారులు వారి వారి పనిముట్లను పూజించడం ఆచారం. తెలంగాణలో జమ్మి ఆకును తీసుకు వచ్చి, జమ్మి బంగారాన్ని అందరికీ పంచి ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకోవడం, ఆశీస్సులు అందుకోవడం ఒక వేడుకగా జరుగుతుంది. పెద్ద పెద్ద సంస్థలలోనూ, కర్మాగారాలలోనూ యంత్రాలను పూజిస్తారు.
ఈ విజయదశమి అందరికీ అన్ని రంగాలలోనూ విజయాలను చేకూర్చాలని ఆదిపరాశక్తిని ప్రార్థిద్దాం!

No comments:

Post a Comment